రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి
- నియోజకవర్గాల పునర్విభజనపై ఇండియా కూటమి నేతలతో చర్చించనున్న రేవంత్
- జీఎస్డీపీ ఆధారంగా కూడా పునర్విభజన జరగాలంటున్న రేవంత్
- ఢిల్లీ వేదికగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటన జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే పునర్విభజన ప్రక్రియలో కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ సీట్ల విభజన జరగాలన్న తన డిమాండ్పై 'ఇండియా' కూటమి నేతలతో ఆయన చర్చించనున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసి విన్నవించనున్నారు.